ఆసియా గేమ్స్‌లో పతకమే లక్ష్యం.. డిస్కస్ త్రోయర్ సీమా కలీరామ్నా

కలం, స్పోర్స్: కామన్వెల్త్ గేమ్స్‌ (Commonwealth Games) లో కాంస్య పతకం సాధించిన భారత డిస్కస్ త్రోయర్ సీమా కలీరామ్నా (Seema Kaliramna), ఇప్పుడు జపాన్ వేదికగా జరిగే ఆసియా గేమ్స్‌ (Asian Games) పై తన దృష్టిని సారించారు. ఇటీవల భువనేశ్వర్‌లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్‌లో ఆమె 57.44 మీటర్ల దూరం త్రో విసిరి నాలుగో స్థానంలో నిలిచారు. ఈ ప్రదర్శనపై ఆమె సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆసియా గేమ్స్ సమయానికి ఇది మంచి ఆరంభమని వ్యాఖ్యానించారు. 27 ఏళ్ల సీమా కెరీర్ ప్రయాణం ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. 2019 వివాహం తర్వాత శిక్షణలో ఆమె 54-55 మీటర్ల దూరం త్రో విసిరేవారు.

అయితే మోకాళ్ళ గాయం, కోవిడ్ కారణంగా పోటీలకు దూరమయ్యారు. ఆ తర్వాత ప్రసవ సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆమె భుజం, నడుము భాగాలు కదల్లేని స్థితికి చేరుకున్నాయి. తీవ్రమైన ఆర్థరైటిస్ బారిన పడటంతో పది మీటర్లు నడవడానికి, పసిబిడ్డను ఎత్తుకోవడానికి కూడా కష్టపడ్డారు.ఆ క్లిష్ట సమయంలో ఆమె భర్త, కోచ్ అయిన రవీందర్ ‘మోను’ కలీరామ్నా ఆమెకు అండగా నిలిచారు. శరీర తత్వానికి అనుగుణంగా మళ్లీ శిక్షణ ప్రారంభించారు.

ఇన్ స్పైర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఐఐఎస్) ఫిజియోథెరపీ, వసతి వంటి పూర్తి మద్దతు అందించింది. క్రమంగా కోలుకున్న సీమా, 2024లో పోటీల్లోకి పునరాగమనం చేశారు. 2025 నేషనల్ గేమ్స్‌లో విజయం సాధించి, జూన్‌లో 59.73 మీటర్ల వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శనతో ఆసియా గేమ్స్‌కు అర్హత సాధించారు. ఆ తర్వాత గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో 58.65 మీటర్ల త్రోతో కాంస్య పతకం గెలుచుకున్నారు.

ఆసియా గేమ్స్‌లో దూరంతో సంబంధం లేకుండా తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే లక్ష్యమని సీమా స్పష్టం చేశారు. పతకం సాధించి తన కుమారుడు రుద్రకు కానుకగా ఇవ్వాలని ఆశిస్తున్నారు. దంపతులిద్దరూ ఒలింపిక్స్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పట్టుదల, సరైన శిక్షణ ఉంటే ఏ కష్టాన్నైనా జయించవచ్చని సీమా ప్రయాణం నిరూపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>