కలం, స్పోర్ట్స్: ఇంగ్లండ్తో ఎడ్జ్బాస్టన్లో జరగబోయే మూడో టెస్టుకు ముందు పాకిస్థాన్ క్రికెట్లో తీవ్ర అలజడి రేగింది. తుది టెస్టులో క్లీన్స్వీప్ ఓటమి నుంచి తప్పించుకోవాలని జట్టు చూస్తుండగా, బోర్డు తీసుకుంటున్న నిర్ణయాలపై మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ ( Saeed Ajmal) విరుచుకుపడ్డారు. మ్యాచ్ల మధ్యలోనే ఏడుగురు ఆటగాళ్లను ఇంటికి పంపి, ఇద్దరు కోచ్లను తొలగించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీబీ తీసుకుంటున్న చర్యల వల్ల పాకిస్థాన్ క్రికెట్ ఏకంగా పదేళ్లు వెనక్కి వెళ్లిపోయిందని అజ్మల్ వ్యాఖ్యానించారు.
ఆటగాళ్లను ప్రోత్సహించాల్సింది పోయి, బోర్డే స్వయంగా వారి మనోధైర్యాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు. జట్టులో ఎవరినీ సరిగ్గా స్థిరపడనివ్వడం లేదని, చివరికి రాణించిన ఆటగాళ్లను కూడా పక్కనపెడుతూ అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఆకిబ్ జావేద్, మైక్ హెస్సన్ కలిసి వ్యవస్థను నడుపుతున్నారని, వారి అహంకారమే ఈ పరిస్థితికి కారణమని అజ్మల్ స్పష్టం చేశారు. భవిష్యత్తు కోసం బోర్డు వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవని విమర్శించారు.
ప్రతి మ్యాచ్ ఓడిన వెంటనే ఆటగాళ్లను మార్చడం పరిష్కారం కాదని ఆయన హితవు పలికారు. అయితే పీసీబీ మాత్రం ఈ నిర్ణయాలను సమర్థించుకుంది. సిరీస్లో ప్రతి మ్యాచ్ కీలకమని, ప్రదర్శన చేయని ఆటగాళ్ల స్థానంలో ఇతరులకు అవకాశం ఇవ్వడం కోసమే ఈ మార్పులు చేశామని తెలిపింది. ఎవరినీ పక్కన పెట్టడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేసింది.

