కలం, కరీంనగర్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతీ దళిత కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా (Karimnagar) ఎస్సీ సెల్ పరిశీలకులు కొరివి అరుణ్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. గతంలో ఎన్నడు లేని విధంగా మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ విభాగము చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు వారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక వినూత్న పద్ధతిలో జిల్లా ఎస్సీ సెల్, నగర ఎస్సీ సెల్ అధ్యక్షుల ఎంపిక కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
పార్టీ కోసం కష్ట పడ్డ వారికి గుర్తింపు ఇవ్వడంలో భాగంగానే పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో నిబద్ధత కలిగి పార్టీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలకు కచ్చితంగా తగిన గుర్తింపు ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం, అర్బన్ డిసిసి అధ్యక్షులు అంజన్ కుమార్ అనుమతితో కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అధ్యక్ష పదవి ఆశావహుల నుంచి కొరివి అరుణ్ కుమార్ దరఖాస్తులు స్వీకరించారు.
కరీంనగర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్ష పదవికి 20 దరఖాస్తులు, నగర ఎస్సీ సెల్ అధ్యక్ష పదవికి 5 దరఖాస్తులు వచ్చాయని, మండల అధ్యక్ష పదవి ఆశిస్తూ దాదాపు 10 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. ఈ దరఖాస్తులన్నిటినీ క్రోడీకరించి ఒక నివేదిక తయారు చేసి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణకి అందజేయడం జరుగుతుందని, ఎటువంటి పైరవీలకు తావు లేకుండా స్థానిక నాయకుల సలహాలు సూచనల మేరకు కష్టపడ్డ కార్యకర్తలతోనే కమిటీల ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు. ఈరోజు దరఖాస్తు చేసుకోలేని ఆశావాహులకు రేపటి వరకు అవకాశం ఉందని, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలలోగా వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దళిత కాంగ్రెస్ నాయకులు, ఆశావహులు తదితరులు పాల్గొన్నారు.

