కలం, వెబ్ డెస్క్ : టీ20 వరల్డ్ కప్లో సంజూ సునామీ సృష్టించాడు. ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్లో కూడా సంజూ శాంసన్ (Sanju Samson) జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ఒకేసారి 18 స్థానాలు ఎగబాకాడు. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్లోనూ భారత ఆటగాళ్లు సత్తా చాటారు. సంజూ శాంసన్ (Sanju Samson) ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 22వ ర్యాంకుకు చేరుకున్నారు. టోర్నీ ఆరంభంలో 65వ స్థానంలో ఉన్న ఆయన, కీలకమైన నాకౌట్ మ్యాచుల్లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాది ఈ ఘనత సాధించారు. ఫైనల్లో 46 బంతుల్లో 89 పరుగులు చేసిన సంజూ, తన కెరీర్ బెస్ట్ రేటింగ్ 637ను కూడా అందుకున్నారు.
మరోవైపు టీమ్ ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ తన నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. సెమీఫైనల్ వరకు తడబడినప్పటికీ, ఫైనల్లో కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదడంతో ఆయన అగ్రస్థానం పదిలమైంది. అలాగే అద్భుత ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ప్రపంచ రెండో ర్యాంకర్గా నిలిచారు. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం ఎగబాకి ఆరో ర్యాంకుకు చేరుకోగా, అర్ష్దీప్ సింగ్ మాత్రం మూడు స్థానాలు దిగజారిపోయారు.
బౌలింగ్ ర్యాంకింగ్స్లో అఫ్గానిస్థాన్ స్టార్ రషీద్ ఖాన్ సంచలనం సృష్టించారు. టీమ్ ఇండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని వెనక్కి నెట్టి రషీద్ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. వరుణ్ చక్రవర్తి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసినప్పటికీ, కీలకమైన సెమీఫైనల్తో సహా చివరి ఐదు మ్యాచ్ల్లో ధారాళంగా పరుగులు ఇచ్చారు. దీనివల్ల గతంలో 818 రేటింగ్తో అగ్రస్థానంలో ఉన్న వరుణ్, ప్రస్తుతం 740 పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోయారు. ప్రపంచ క్రికెట్లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.

