పంజాబ్‌పై సంజూ పంజా విసరడం పక్కా: శ్రీకాంత్

కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026(IPL 2026)లో భాగంగా శుక్రవారం చెపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా సీఎస్‌కే ఓపెనర్ సంజూ శామ్సన్ ఫామ్‌పై టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో సంజూ పంజా విసరడం పక్కా అని ఆయన జోస్యం చెప్పారు. గత మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే వెనుదిరిగిన సంజూ గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ.. “సంజూని తక్కువ అంచనా వేయకండి. చెపాక్ వికెట్ అతనికి కలిసొచ్చే వేదిక. ఇక్కడే అతను టీ20 వరల్డ్ కప్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ కొట్టాడు. ఈ పిచ్‌పై తొలి ఐదు బంతులు ఆడాడంటే చాలు.. ఆ తర్వాత పంజాబ్ బౌలర్లకు చుక్కలు కనిపిస్తాయి” అని తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నారు.

కేవలం సంజూ గురించే కాకుండా సీఎస్‌కే బ్యాటింగ్ ఆర్డర్‌పై కూడా శ్రీకాంత్ కీలక సూచనలు చేశారు. విధ్వంసకర బ్యాటర్ శివమ్ దూబేను నంబర్ 7లో కాకుండా, నంబర్ 4 లేదా 5 స్థానంలో పంపాలని కోరారు. రుతురాజ్, సంజూలు కలిసి సెంచరీ పార్టనర్‌షిప్ నమోదు చేస్తే పంజాబ్‌కు ఓటమి తప్పదని విశ్లేషించారు. గుజరాత్‌పై విజయంతో ఊపుమీదున్న పంజాబ్ కింగ్స్ పటిష్టంగా ఉన్నప్పటికీ, సంజూ శామ్సన్ ఒక్కసారి గేర్ మారిస్తే పంజాబ్ వద్ద దానికి సమాధానం ఉండదని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉన్న ఈ మ్యాచ్‌లో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>