కలం, వెబ్ డెస్క్: ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ (Actress Varalaxmi Sarathkumar) మరో వివాదంలో చిక్కుకున్నారు. వరలక్ష్మి డబ్బులు తీసుకొని కూడా తన సినిమా ప్రమోషన్లలో పాల్గొనేందుకు రాలేదని ఓ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన తాజా చిత్రం పోలీస్ కంప్లైంట్ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో అందాల రాక్షసి ఫేమ్ నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించారు. సంజీవ్ మేగోటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జూన్ 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్లు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. ప్రమోషన్లలో భాగంగా జరిగిన ఓ కార్యక్రమంలో డైరెక్టర్ సంజీవ్ మేగోటి హీరోయిన్ వరలక్ష్మిపై సంచలన ఆరోపణలు చేశారు. వరలక్ష్మి డబ్బులు తీసుకొని కూడా తన సినిమా ప్రమోషన్లకు రావడం లేదని ఆరోపించారు.
సినిమా షూటింగ్ సమయంలో సైతం ఆమె కొంత ఇబ్బందులకు గురి చేసిందని చెప్పుకొచ్చారు. సినిమా ప్రమోషన్ కోసం ఫోన్ చేసి బ్రతిమాలుకున్నా టైం లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిందన్నారు. డబ్బింగ్ సమయంలో కూడా చాలా ఇబ్బంది పెట్టిందని, మూడు నెలల పాటు ఎదురు చూడాల్సి వచ్చిందని తెలిపారు. ఇక ఒకానొక సమయంలో డబ్బింగ్ చెప్పడం కుదరదని, వేరే వాళ్లతో చెప్పించుకోవాలని ఉచిత సలహా ఇచ్చిందన్నారు. రామ్ చరణ్ లాంటి నటుడే తన సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారని, ఇంకా సింగీతం శ్రీనివాస రావు అంత వయస్సులో కూడా తన సినిమా కోసం ప్రమోషన్లలో పాల్గొన్నారని సంజీవ్ గుర్తు చేశారు. తన కంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో అనుభవమున్నా తనను ప్రమోషన్లకు రావాలని బతిమాలానని సంజీవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వరలక్ష్మి యాక్టింగ్తో పాటు, డైరెక్టర్గా బిజీగా ఉంది. సొంత సినిమా ప్రమోషన్కు రాకపోవడం, డైరెక్టర్ సంజీవ్ ఆరోపణలపై నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

