కలం, కరీంనగర్ బ్యూరో: గౌరవెల్లి ప్రాజెక్ట్ కాలువల భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam prabhakar) అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ పరిధిలోని మూడు జిల్లాల్లో భూసేకరణకు అవసరమైన నిధులు ఇప్పటికే విడుదలైనట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన భూ కేటాయింపుల పురోగతిపై అధికారులను ఆరా తీసిన మంత్రి, టీటీడీ దేవస్థానం, ఇంటిగ్రేటెడ్ ఫిష్ మార్కెట్, మహిళా బజార్ ఏర్పాటు కోసం అవసరమైన భూముల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
మూడు జిల్లాల డీఈవోలతో సమీక్ష..
చౌటపల్లి పారిశ్రామిక కారిడార్ భూసేకరణ పనుల పురోగతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించి, నిర్ణీత గడువుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యార్థుల సంఖ్య పెంపుపై నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంఈవోలు, సిద్దిపేట, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల డీఈఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు ప్రతి గ్రామంలో విస్తృతంగా బడిబాట కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న పెయింటింగ్ పనులు, మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులు పాఠశాలలకు ఆకర్షితులయ్యే విధంగా పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

