కలం, జనగామ: ప్రజల భాగస్వామ్యం, సహకారంతోనే రోడ్డు ప్రమాదాలను నియంత్రించగలమని ఆపరేషన్స్ డీజీపీ అనిల్ కుమార్ పేర్కొన్నారు. వరంగల్ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో జనగామ (Jangaon) జిల్లా కేంద్రంలోని మాంగళ్య కల్యాణ వేదికలో ‘అరైవ్ అలైవ్‘ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆపరేషన్స్ డీజిపీ అనిల్ కుమార్, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా గతంలో లక్ష73 వేలమంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని, దీని కారణంగా దేశ జీడీపీకి 3 శాతం నష్టం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో గత ఏడాది 7వేలకుపైగా ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో మరణించారని పేర్కొన్నారు. దీని కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఎన్ని భారీ ప్రమాదాలు జరిగిన ప్రజల్లో మార్పు రావడంలేదని, విదేశాల్లో ట్రాఫిక్ రూల్స్ అతి కఠినంగా ఉంటాయని అక్కడ ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే వీళ్ళల్లో జరిమాలను విధించబడతాయన్నారు. కానీ మనదేశంలో మాత్రం ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే తక్కువగా జరిమానాలు విధించడం ద్వారా వాహనదారులకు భయం లేకుండా పోయిందన్నారు.
దేశంలో రోడ్డు ప్రమాదాలకు ఇది కూడా ఒక కారణమని వివరించారు. ట్రాఫిక్ రూల్స్ మీ భద్రత కోసమని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించగలమన్నారు. అరైవ్ అలైవ్ ముఖ్య ఉద్దేశం వాహన దారుడు స్వీయ రక్ష పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవడమే అన్నారు. ఆరు నెలలుగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా వరంగల్ కమిషనరేట్ పరిధిలో 15 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గు ముఖం పట్టాయన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు రాజమహేంద్ర నాయక్, అంకిత్ కుమార్, ధార కవిత, అదనపుడిసిపి ప్రభాకర్ రావు, ఏసీపీలు భీమ్ శర్మ, నర్సయ్య, సత్యనారాయణ తో పాటు వెస్ట్ జోన్, ట్రాఫిక్కు చెందిన ఇన్ స్పెక్టర్లు, ఎస్సైలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

