కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన ‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేసును విచారిస్తున్న నాంపల్లి న్యాయస్థానం, రాబోయే సోమవారం వ్యక్తిగతంగా తమ ముందు విచారణకు హాజరుకావాలని అల్లు అర్జున్ను ఆదేశించింది.
ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. థియేటర్ యాజమాన్యంతో పాటు మొత్తం 23 మందిని బాధ్యులను చేస్తూ పోలీసులు న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ నిందితుల జాబితాలో హీరో అల్లు అర్జున్ను ఏ-11 (A11) నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఈ నేపథ్యంలో కోర్టు జారీ చేసిన సమన్లు టాలీవుడ్తో పాటు సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.

