కలం, వెబ్ డెస్క్: అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో(San Francisco)లో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఎక్స్ వేదికగా ఒక విషాద వార్తను వెల్లడించింది. ఇటీవల తప్పిపోయిన భారతీయ విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య (Saketh Sreenivasaiah) మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించినట్లు తెలిపింది. ఈ ఘటనపై కాన్సులేట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సాకేత్ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు సానుభూతి తెలియజేసింది. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అవసరమైన అన్ని విధాల సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ, మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్కు తరలించేందుకు చర్యలు చేపట్టారు. భారత అధికారులు ఇప్పటికే సాకేత్ కుటుంబసభ్యులతో నేరుగా సంప్రదింపులు కొనసాగిస్తూ, అవసరమైన అన్ని విధి విధానాల్లో పూర్తి సహకారం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పోస్టులో కాన్సులేట్ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయాన్ని కూడా ట్యాగ్ చేసింది. కర్ణాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో పీజీ చదువుతున్నట్లు వెల్లడించింది.


