కలం, వెబ్డెస్క్: బాక్సింగ్ రింగ్లో భారత మహిళా బాక్సర్ సాక్షి చౌదరీ (Sakshi Chaudhary) సంచలనం సృష్టించారు. పటియాలా బాక్సింగ్ ట్రయల్స్లో వరుసగా ఇద్దరు ప్రపంచ ఛాంపియన్లను ఓడించి కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలకు తొలిసారి అర్హత సాధించింది. తీవ్ర ఒత్తిడి, నిరాశ మధ్య రింగ్లోకి దిగిన సాక్షి.. ఇప్పుడు భారత బాక్సింగ్లో హాట్ టాపిక్గా మారింది. కొద్ది కాలం క్రితం వరకు సాక్షి కెరీర్ కష్టాల్లోనే కనిపించింది. ప్రపంచ చాంపియన్షిప్లో ఓటమి, జాతీయ ఛాంపియన్షిప్లో నిరాశాజనక ప్రదర్శన ఆమెను వెనక్కి నెట్టాయి. ఆ తర్వాత ఆసియా ఛాంపియన్షిప్కు కూడా ఎంపిక కాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైంది. అయితే కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో ఆడాలన్న పట్టుదలతో 54 కేజీల నుంచి 51 కేజీల విభాగానికి మారాలని నిర్ణయించుకుంది.
బరువు తగ్గడం పెద్ద సవాలే అయినా, తన లక్ష్యం కోసం కష్టపడినట్లు సాక్షి తెలిపింది. ట్రయల్స్లో మొదట తనుపై గెలిచిన సాక్షి, తర్వాత నిఖత్ జరీన్పై అద్భుత వ్యూహంతో విజయం సాధించింది. దగ్గరగా పోరాడితే నిఖత్ బలంగా మారుతుందని తెలుసుకుని, దూరం పాటిస్తూ ఎడమ జాబ్తో మ్యాచ్ను కంట్రోల్ చేసినట్లు ఆమె వెల్లడించింది. అదే వ్యూహాన్ని మీనాక్షిపై కూడా అమలు చేసి మరో భారీ విజయం అందుకుంది. 51 కేజీల్లో తన ఎత్తు, పవర్కు సరైన సమతౌల్యం దొరికిందని, ఈ విజయాలు తనలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపాయని సాక్షి పేర్కొంది.

