కలం, వెబ్ డెస్క్ : అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వలన ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సయోధ్య (US Iran Peace )ను భారత్ కుదర్చగలదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అంతర్జాతీయ వేదికపై వెల్లడించారు. న్యూ ఢిల్లీ వేదికగా బ్రిక్స్ (BRICS) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం ముగిసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించి, శాంతిని నెలకొల్పడంలో భారత్ అత్యంత సమర్థవంతమైన మధ్యవర్తిగా వ్యవహరించగలదని సెర్గీ లావ్రోవ్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల కోసం పాకిస్థాన్ కూడా ప్రయత్నిస్తోందని ఆయన గుర్తు చేశారు. అయితే అంతర్జాతీయ రాజకీయాల్లో న్యూఢిల్లీకి ఉన్న అపారమైన దౌత్య అనుభవం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉన్నతమైన ప్రతిష్ఠ కారణంగా భారత్ ఈ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలదని స్పష్టం చేశారు.

