కలం, వెబ్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా చలి తగ్గినా దట్టమైన పొగమంచు (Fog) వీడటం లేదు. హైవేలు, ప్రధాన రహదారులను పొగమంచు కమ్మేస్తోంది. ఈ కారణంగా పలు చోట్ల వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. తెల్లవారుజామున ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Sajjanar) ట్విట్టర్ వేదికగా శుక్రవారం డ్రైవర్లకు కీలక సూచనలు చేశారు.
‘‘సంక్రాంతి సంబరం విషాదం కాకూడదు.. పండుగ నాడు పల్లెకు చేరాలన్న ఆత్రుత, మీ ప్రాణాల మీదకు తేకూడదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కమ్మేసిన దట్టమైన పొగమంచు.. మృత్యువుకు ముసుగులా మారింది. ఎదురుగా ఏముందో కనిపించని ఈ పరిస్థితిలో డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరం. పొగమంచులో సొంత వాహనాల్లో ప్రయాణం వద్దు. తెల్లవారుజామున లేదా అర్ధరాత్రి వేళల్లో సాహసం చేయకండి. దయచేసి పొగమంచు పూర్తిగా తగ్గి, రోడ్డు స్పష్టంగా కనిపించిన తర్వాతే మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. మీ రాక కోసం మీ వాళ్లు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. వారి కళ్లలో ఆనందాన్ని నింపండి.. కన్నీళ్లను కాదు.’’ అని ట్వీట్ చేశారు.
ఈ జాగ్రత్తలు పాటించండి
- పొగమంచు ఉన్నప్పుడు వాహనం నడపాల్సి వస్తే.. ఫాగ్ లైట్లు (Fog Lights), ఇండికేటర్లు ఆన్ చేయండి.
- ముందు వెళ్లే వాహనానికి తగినంత దూరం (Safe Distance) పాటించండి.
- రోడ్డు ఖాళీగా ఉందని వేగంగా వెళ్లొద్దు.
- హైవేలపై మంచు తగ్గిన తర్వాతనే ప్రయాణాలు చేయండి


