కలం, వెబ్ డెస్క్ : సీఎం చంద్రబాబు దుర్మార్గపు పాలన, అరాచకాలపై పోరాటం చేయాలని వైఎస్సార్సీపీ స్టేట్ కో – ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మైనారిటీ వింగ్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. వ్యక్తిగత విమర్శలు, రాజకీయ దూషణలకే పరిమితమయ్యారని ఆరోపించారు. న్యాయం కోసం పోరాడుతున్న డీఎస్సీ అభ్యర్థులపై కూడా విమర్శలు చేయడం దుర్మార్గం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఎలాంటి వివాదాలు లేకుండా లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేసినట్లు సజ్జల చెప్పుకొచ్చారు. కానీ, చంద్రబాబు 16 వేల ఉద్యోగాలను కూడా సరిగా భర్తీ చేయలేదని ఆయన ఆరోపించారు. సర్ ప్రక్రియపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని.. వైఎస్సార్సీపీ అనుకూల ఓట్లను తొలగించే కుట్రలను అడ్డుకోవాలని సజ్జల పిలుపునిచ్చారు. జూన్ 15 నుంచి ప్రారంభమయ్యే ఇంటింటి సర్వేపై ప్రజల్లో అవగాహన కల్పించాలని శ్రేణులకు సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి పార్టీ బలాన్ని చాటాలని.. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో తగిన గుర్తింపు ఉంటుంది అని సజ్జల స్పష్టం చేశారు.

