కలం, నిర్మల్ : వానాకాలం–2026 సీజన్కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద నిర్మల్ (Nirmal) జిల్లాలో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని నేరుగా జమ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై 4వ తేదీ నాటికి జిల్లాలో మొత్తం 1,81,379 మంది రైతుల ఖాతాల్లో రూ.222.42 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్లు వెల్లడించారు.
సాగు ప్రారంభ దశలోనే రైతులకు పెట్టుబడి భారం తగ్గించి, సకాలంలో వ్యవసాయ పనులు చేపట్టేందుకు అవసరమైన ఆర్థిక చేయూత అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నిధుల విడుదల కొనసాగుతోందని పేర్కొన్నారు. ముధోల్లో 85,468 మంది రైతులకు రూ.118.34 కోట్లు, ఖానాపూర్లో 62,632 మంది రైతులకు రూ.75.31 కోట్లు, నిర్మల్లో 63,752 మంది రైతులకు రూ.69.37 కోట్లు వారి ఖాతాల్లో జమ అయినట్లు తెలిపారు.
అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం ప్రకటించిన మేరకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక పర్యవేక్షణతో చర్యలు చేపడుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. నిధుల జమ ప్రక్రియను సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, సాంకేతిక లేదా పరిపాలనా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

