కలం, నల్లగొండ : నల్లగొండ (Nalgonda) జిల్లా నార్కట్పల్లి (Narketpally) బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె (RTC Workers Strike) గురువారం కూడా కొనసాగింది. తమ సమస్యల పరిష్కారం, ఆర్టీసీ సంస్థ రక్షణ కోసం వారు నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళనకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah) హాజరై కార్మికులకు సంఘీభావం తెలిపారు. కార్మికులతో కలిసి నిరసనలో పాల్గొన్న ఆయన, బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన ఉంటుందని స్పష్టం చేశారు. తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తప్పకుండా నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అధికార దాహంతో, అబద్ధపు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఆర్టీసీ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ కార్మికులకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

