కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లాలో నిబంధనలు ఉల్లంఘిస్తూ నడుస్తున్న ప్రైవేట్ బస్సులపై రవాణా శాఖ (ఆర్టీఏ) అధికారులు ఉక్కుపాదం మోపారు. సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద డీటీఓ దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన అధికారులు వివిధ మార్గాల్లో ప్రయాణికులను తరలిస్తున్న బస్సులను తనిఖీ చేసి, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 16 ప్రైవేట్ బస్సులను సీజ్ చేశారు. తనిఖీల్లో పలు బస్సులకు సరైన అనుమతులు లేకపోవడం, ఫిట్నెస్ సర్టిఫికెట్లు గడువు ముగియడం, పన్నులు చెల్లించకపోవడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వంటి ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రైవేట్ బస్సు యజమానులు తప్పనిసరిగా రవాణా శాఖ నిబంధనలు పాటించాలని, అవసరమైన పత్రాలు పూర్తి స్థాయిలో ఉంచాలని అధికారులు హెచ్చరించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రత్యేక డ్రైవ్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఆర్టీఏ చర్యలతో నిబంధనలు ఉల్లంఘిస్తున్న బస్సు యజమానుల్లో కలకలం రేగింది. ఈ తనిఖీల్లో ఎంవీఐలు దూప్ సింగ్, తిరుపతి, ఏఎంవీఐలు రజినీకాంత్, ఆసిఫ్, అక్షయ్, సిబ్బంది పాల్గొన్నారు.

