కలం, వెబ్ డెస్క్: భూపాలపల్లి (Bhoopalpally)లో ఆర్టీవో అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా టిప్పర్ బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో ఇసుక మాఫియా, బొగ్గు మాఫియాకు అడ్డు వస్తున్నాడన్న కారణంతోనే డీటీవో వెంకన్న (DTO Venkanna)ను లారీతో తొక్కించి చంపేశారని ఆరోపించారు. వెంకన్న ప్రమాదం వెనుక దాగిన నిజాన్ని వెలికితీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. అధికారులను బెదిరిస్తూ అక్రమ దందాలు సాగిస్తున్న ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. డీటీఓ వెంకన్న మరణం వెనుక ఉన్న వాస్తవాలను ప్రజల ముందుంచాలన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ పోస్టులో సీఎం కార్యాలయంతో పాటు, తెలంగాణ డీజీపీని హరీశ్ రావు ట్యాగ్ చేశారు.

