కలం, స్పోర్ట్స్ : లక్నో సూపర్ జయింట్స్తో జరుగుతున్న మ్యాచ్ (RR vs LSG)లో రాజస్థాన్ రాయల్స్ టాప్ ఆర్డర్ చతికిలబడింది. జైస్వాల్ 22 పరుగులు చేయగా, చిచ్చరపిడుగు వైభవ్, ఆ తర్వాత వచ్చే జురేల్ కానీ డబుల్ డిజిట్ స్కోర్ కూడా చేయలేదు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో కూడా కెప్టెన్ రియాన్ పరాగ్.. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడలేదు. టేలెండర్ కన్నా అధ్వాన్నంగా 19 బంతుల్లో 20 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (22) మెరుపులు మెరిపిస్తున్న క్రమంలో షమీ దెబ్బకొట్టాడు. కేవలం 32 పరుగుల వద్దే జైస్వాల్తో పాటు ధ్రువ్ జురెల్ (0) వికెట్లను ఒకే ఓవర్లో కోల్పోవడంతో ఆర్ఆర్ పీకల్లోతు కష్టాల్లో పడింది. కాసేపటికే వైభవ్ సూర్యవంశీ (8) కూడా పెవిలియన్ చేరడంతో పవర్ ప్లే ముగిసేసరికి రాజస్థాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు.
మిడిల్ ఓవర్లలో రియాన్ పరాగ్ (20), హెట్మెయర్ (22) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా.. లక్నో బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు ఎక్కువ సేపు నిలవలేకపోయారు. మొహ్సిన్ ఖాన్ తన స్పెల్లో కేవలం 17 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసి రాజస్థాన్ రన్ రేట్ను కట్టడి చేశాడు. ప్రిన్స్ యాదవ్ కూడా కీలక వికెట్లు తీసి ఆర్ఆర్ స్కోర్ బోర్డును దెబ్బతీశాడు. ఒక దశలో 110 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన రాయల్స్ను సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజా ఆదుకున్నాడు.
చివర్లో జడేజా (43 నాటౌట్; 29 బంతుల్లో) తన అనుభవాన్ని అంతా జోడించి స్కోరును పరుగులు పెట్టించాడు. అతనికి శుభం దూబే (19 నాటౌట్) చక్కని సహకారం అందించడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగలిగింది. మయాంక్ యాదవ్ బౌలింగ్ను టార్గెట్ చేసిన జడేజా జోడీ ఆఖరి ఓవర్లలో విలువైన పరుగులు రాబట్టింది. ఇప్పుడు లక్నో విజయం సాధించాలంటే 120 బంతుల్లో 160 పరుగులు చేయాల్సి ఉంది.

