కలం, స్పోర్ట్స్ : టెన్నిస్ అభిమానులకు ఇది నిజంగా తీపి కబురు. దిగ్గజ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెడరర్ (Roger Federer) మళ్లీ టెన్నిస్ కోర్టులో సందడి చేయడానికి సిద్ధమయ్యారు. యూఎస్ ఓపెన్ ప్రారంభానికి ముందు జరుగుతున్న ‘ఫ్యాన్ వీక్’ ప్రదర్శన మ్యాచ్ల్లో ఆయన పాల్గొంటున్నారు. న్యూయార్క్లోని ప్రసిద్ధ ఆర్థర్ యాష్ స్టేడియంలో 2019 తర్వాత ఆయన ఆడటం ఇదే తొలిసారి.
ఈ ప్రత్యేక మ్యాచ్లో ఫెడరర్తో పాటు ఆయన పాత ప్రత్యర్థులు ఆండీ రాడిక్, ఆండ్రీ అగస్సీ, జాన్ మెకన్రో కూడా పాల్గొంటున్నారు. ఈ నలుగురు ఆటగాళ్లు కలిసి ఇప్పటివరకు 12 యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్నారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఫెడరర్ మాట్లాడారు. ఈ మ్యాచ్ తనకు అభిమానులకు కృతజ్ఞతలు చెప్పుకునే మంచి అవకాశం ఇచ్చిందని ఆయన తెలిపారు. ఈ వారం చివర్లో న్యూపోర్ట్లో జరిగే ‘ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్’ గౌరవ సత్కారానికి కూడా ఆయన హాజరుకానున్నారు.
2019 యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్లో ఫెడరర్ ఓడిపోయిన సమయంలో, ఆయన కెరీర్ కొనసాగించాలని భావించారు. అయితే గాయాల కారణంగా 2020, 2021 టోర్నీలకు దూరమయ్యారు. ఆ తర్వాత సెప్టెంబరు 2022లో జరిగిన లేవర్ కప్లో తన చివరి మ్యాచ్ ఆడి ఆట నుండి నిష్క్రమించారు. దీనివల్ల న్యూయార్క్ అభిమానులు ఆయనకు సరైన వీడ్కోలు చెప్పలేకపోయారు.ఇన్నాళ్ల తర్వాత మళ్లీ మ్యాచ్ ఆడటంపై ఫెడరర్ స్పందించారు.
తన నలుగురు పిల్లలు ఇప్పుడు పెద్దవారయ్యారని, తాను కోర్టులో ఆడటం చూసి వారు ఆనందిస్తారని చెప్పారు. ఈ ప్రదర్శన మ్యాచ్ చాలా సరదాగా సాగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.అయితే, టెన్నిస్లోకి మళ్లీ రీ-ఎంట్రీ ఇస్తారా అని అడిగిన ప్రశ్నకు ఫెడరర్ ఖచ్చితంగా ‘లేదని’ సమాధానమిచ్చారు. వైల్డ్కార్డ్ ద్వారానైనా తిరిగి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. తనకు చాలా పనులు ఉన్నాయని, ప్రస్తుతం కేవలం ఒక అభిమానిగా ఆటను ఆస్వాదిస్తున్నానని తెలిపారు.

