కలం, కరీంనగర్ బ్యూరో: రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను కాపాడి సకాలంలో ఆసుపత్రికి తరలించే మానవతావాదులను ‘రహావీర్’ గా గుర్తిస్తామని రోడ్ సేఫ్టీ (Road Safety), రైల్వేస్ ఐజీ రమేష్ నాయుడు అన్నారు. , ప్రభుత్వం తరపున వారికి రూ. 25,000 పారితోషికం అందిస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ సీపీ గౌష్ ఆలంతో కలిసి బుధవారం చొప్పదండిలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా 14 వార్డులకు సంబంధించిన సభలలో ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) రోడ్డు సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే కూడా హాజరయ్యారు. సహజ మరణాల తర్వాత దేశంలో, రాష్ట్రంలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాల వల్లే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సగటున ఏడాదికి ఏడు వేలకు పైగా మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని తెలిపారు.
ఎమ్మెల్యే సత్యంకు ‘రహావీర్’ సత్కారం..
గంగాధర మండలంలో రోడ్డు ప్రమాదానికి గురైన ఒక వృద్ధురాలిని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మానవత్వంతో స్పందించి, తన సొంత వాహనంలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ.. ఎమ్మెల్యేను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఐజీ రమేష్ నాయుడు, సీపీ గౌష్ ఆలం పిలుపునిచ్చారు. ‘రహావీర్’గా నిలిచిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ఐజీ, సీపీ ఘనంగా సత్కరించి రూ.25 వేల పురస్కారం అందించారు. అనంతరం పట్టణంలో రోడ్డు భద్రతను ప్రోత్సహించేందుకు 140 మందికి ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ అవగాహన సదస్సులో ఏసీపీ విజయ్ కుమార్, సీఐ ప్రదీప్ కుమార్, చొప్పదండి ఎస్ఐ నరేష్ రెడ్డి, గంగాధర ఎస్సై వంశీకృష్ణ, రామడుగు ఎస్ఐ రాజు, మున్సిపల్ ఛైర్పర్సన్ వడ్లూరి సరిత-శ్రీనివాస్, వైస్ ఛైర్పర్సన్ పెరుమండ్ల మానస-గంగయ్య, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, తహశీల్దార్ నవీన్ కుమార్, ఎంపీడీవో వేణుగోపాలరావు
తదితరులు పాల్గొన్నారు.

