కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని రాజీవ్ రహదారి (శ్రీ చైతన్య పాఠశాల సమీపంలో) శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిమ్మాపూర్ మండల కేంద్రంలో అతివేగంతో వెళ్తున్న ఒక థార్ వాహనం అదుపు తప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ (Karimnagar) నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న థార్ వాహనం, రాజీవ్ రహదారిపై తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల సమీపానికి రాగానే అదుపు తప్పింది. అతివేగంగా ఉన్న వాహనం రోడ్డు పక్కన ఉన్న కల్వర్టు డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు వాహనం నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.
Read Also: ప్రయాణికులకు అలర్ట్.. 40 రైళ్లు దారి మళ్లింపు
Follow Us On: Instagram

