కలం, వెబ్ డెస్క్ : నూరేళ్లుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన కులగణన అంశాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా సాధించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వే వివరాలను బహిర్గతం చేయడంతో, దాన్ని కాపీ కొట్టక కేంద్ర ప్రభుత్వానికి వేరే మార్గం లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. చివరకు కేంద్రం తెలంగాణ ముందు తలవంచక తప్పలేదని వ్యాఖ్యానించారు.
ఈ నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వమే దేశానికి దిక్సూచిగా నిలిచిందని సీఎం అన్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైనప్పటికీ, చివరకు న్యాయస్థానం కూడా కులగణనకే మొగ్గు చూపాల్సి వచ్చిందని గుర్తు చేశారు. తక్షణమే దేశవ్యాప్త జనగణనలో కులగణనను చేర్చాలని ప్రధానమంత్రిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని చెప్పారు. దేశంలో కులగణనకు నాంది పలికిన ఘనత, కేంద్రంలో కదలిక తెచ్చిన చరిత్ర, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన గౌరవం ముమ్మాటికీ తెలంగాణ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

