కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రక్షణ సేన (TRS) జెండా పండుగను ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత (TRS Chief Kavitha) ప్రారంభించారు. కాసేపటి క్రితం కుత్బుల్లాపూర్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రారంభమైన ఈ జెండా పండుగ కార్యక్రమం నెల రోజులు అంటే వచ్చే నెల 20వ తేదీ వరకు కొనసాగుతుందని వెల్లడించారు.
ఈ మేరకు తెలంగాణ రక్షణ సేన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నెల రోజుల జెండా పండుగ నిర్వహించాలని కవిత పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను గుర్తు చేసుకుని కవిత ఎమోషనల్ అయ్యారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తెలంగాణ అమరవీరుల స్థూపం నిర్మించి 20 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు ప్రారంభించలేదని మండిపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 లోగా అమరుల స్థూపాన్ని అధికారికంగా ప్రారంభించాలని ప్రభుత్వానికి డెడ్లైన్ విధించారు. గడువులోగా ప్రారంభించకుంటే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో తామే స్వయంగా స్థూపాన్ని ఆవిష్కరిస్తామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.

