కలం, మహబూబ్నగర్ బ్యూరో : మహబూబ్నగర్ జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) అమలుపై అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ఎన్. ఖీమ్య నాయక్ (Khimya Nayak) సమీక్ష నిర్వహించారు. పథకంలో పనిచేసే ప్రతి కార్మికుడికి పని కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్లో ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఉపాధి హామీ పనులు ఈ ఏడాది జూన్ వరకు పొడిగించబడినందున గ్రామీణ ప్రాంతాలలో దీనిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పని కోరుకునే ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, మ్యాజిక్ ఇంకుడు గుంతలు, రూఫ్ టాప్ జల సంరక్షణ వంటి అనేక పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ జాబ్ కార్డు జారీ చేయాలని ఆదేశించారు. జాబ్ కార్డు ఉన్న వారి జాబితాను గ్రామ స్థాయిలో గ్రూపులలో అందుబాటులో ఉంచాలని సూచించారు. ఉపాధి హామీ పనులు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించుకోవచ్చని, పని సమయంలో కార్మికులకు త్రాగునీరు, చలువ నీడ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండాలని తెలిపారు. అలాగే మండల, గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి కొత్త పనులు సృష్టించాలని సూచించారు. పని దినాల సంఖ్య పెరిగితే గ్రామ పంచాయతీలకు సీసీ రోడ్ల నిర్మాణానికి మెటీరియల్ కాంపోనెంట్ పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి రోజు కనీసం 40 శాతం కార్మికులకు పని కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో యాదయ్య, పీడీ ఆర్డీఓ ఉమాదేవి, మండల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

