ఆరోగ్యశ్రీ బకాయిలు వారసత్వంగా వచ్చాయి: CM రేవంత్

కలం, వెబ్ డెస్క్: ఆరోగ్య శ్రీ పథకంపై విపక్ష సభ్యులు ఆరోపణలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy) అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్య శ్రీ పథకంపై సుదీర్ఘంగా వివరించారు. ఈ పథకానికి తమ ప్రభుత్వం ప్రతినెలా సగటున రూ. 89 కోట్లు ఖర్చు పెట్టిందని వెల్లడించారు. తమ ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ బకాయిలు వారసత్వంగా వచ్చాయన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.600 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టిందని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.240.11 కోట్లు, ప్రైవేటు ఆస్పత్రులకు రూ.360.16 కోట్ల బకాయిలు ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటివరకు రూ.2408.51 కోట్ల బిల్లులు చెల్లించామని తెలిపారు. దీనిలో ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.927 కోట్లు చెల్లించామని వివరించారు. ఆరోగ్యశ్రీ బిల్లులు తాము ఎప్పటికప్పుడు చెల్లిస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. 27 నెలల్లో పేదల వైద్యం కోసం రూ.4,500 కోట్లు చెల్లించామని తెలిపారు.

రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథక పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని సీఎం రేవంత్ తెలిపారు. టీచింగ్ కాలేజీల నిర్వహణ గ్రూప్‌-1 అధికారులకు అప్పగిస్తామని చెప్పారు. ప్రతి కుటుంబానికి జీవిత బీమా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం తీసుకువచ్చిందని స్పష్టం చేశారు. విదేశాల్లో నిపుణులైన వైద్యుల సేవలను తమ ప్రభుత్వం ఉపయోగించుకోవాలని ఆలోచిస్తుందని వివరించారు. ప్రతిపక్ష సభ్యులు పేదలకు అన్యాయం జరుగుతోందంటూ అపోహలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో రూ.2046 కోట్ల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ చేశామని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) ఎలా దుర్వినియోగం చేశారో తమకు తెలుసు అని పేర్కొన్నారు. ఎవరి పీఏలు సీఎం రిలీఫ్ ఫండ్ కాజేశారో కూడా తెలుసు అంటూ ఆరోపించారు. దీనిపై విచారణ జరుగుతోందని, అన్నీ బయటకు వస్తాయన్నారు.

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>