కలం, వెబ్ డెస్క్: టీమ్ ఇండియా డైనమిక్ ఓపెనర్ పృథ్వీ షా (Prithvi Shaw) మళ్లీ ఫామ్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. గత వేలంలో ఎవరూ కొనుగోలు చేయకపోయినా, ఇప్పుడు తిరిగి తన పాత గూడు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)కు చేరుకున్నాడు. ఏప్రిల్ 1న లక్నో సూపర్ జెయింట్స్తో జరగనున్న తొలి మ్యాచ్కు ముందే షా తన ఫిట్నెస్, మైండ్సెట్పై కీలక వ్యాఖ్యలు చేశారు. గత రెండు సీజన్లు పృథ్వీ షాకు ఆశించిన స్థాయిలో సాగలేదు. 2023, 2024 ఐపీఎల్ (IPL) ఎడిషన్లలో కలిపి 16 ఇన్నింగ్స్ ఆడిన షా, కేవలం 304 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న తరుణంలో, 2024 సీజన్ మధ్యలోనే ఢిల్లీ యాజమాన్యం అతడిని పక్కన పెట్టింది. ఆ తర్వాత ముంబై దేశవాళీ జట్టులోనూ చోటు కోల్పోయారు. ఈ గడ్డు కాలాన్ని అధిగమించేందుకు షా తన జట్టును మార్చుకున్నారు. కెరీర్ను పునఃప్రారంభించే క్రమంలో ఈ దేశవాళీ సీజన్లో మహారాష్ట్ర తరపున ప్రాతినిధ్యం వహించారు.
ఈ విరామం తనకు మానసిక ప్రశాంతతను ఇచ్చిందని, శారీరక దృఢత్వాన్ని పెంచుకోవడానికి సహాయపడిందని పృథ్వీ షా (Prithvi Shaw) పేర్కొన్నారు. తను తీసుకున్న ఈ బ్రేక్ గురించి స్పందిస్తూ.. ఆ సమయంలో విహారయాత్రలకు వెళ్లి మనసుని ప్రశాంతంగా ఉంచుకున్నట్లు షా తెలిపారు. తిరిగి వచ్చాక తన దినచర్యను మార్చుకుని, మునుపటి కంటే మూడు రెట్లు కష్టపడి ప్రాక్టీస్ చేసినట్లు వెల్లడించారు. తాను కూడా మనిషినేనని, తప్పులు చేయడం సహజమని ఆయన అంగీకరించారు. సోషల్ మీడియాలో తన గురించి వచ్చే వార్తలను పట్టించుకోవడం మానేశానని, తన కుటుంబం, స్నేహితులకు తన గురించి పూర్తిగా తెలుసని షా స్పష్టం చేశారు. గతాన్ని మరిచిపోయి, ఇప్పుడు మైదానంలోకి అడుగుపెట్టడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని ఆయన అన్నారు.

