కలం, వెబ్ డెస్క్: డీలిమిటేషన్పై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన అవగాహనతో ఉన్నారని ప్రభుత్వ విప్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) స్పష్టం చేశారు. ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే తెలంగాణకి అన్యాయం తప్పదు అని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనతో రేవంత్ రెడ్డి జాగ్రత్త పడ్డారని చెప్పారు. దీనిపై తెలంగాణ బీజేపీ నేతలు స్పందించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గాలు పెరిగితే కాంగ్రెస్ పార్టీకే లాభం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ఏ మండలాలు ఏ నియోజకవర్గాల్లో కలిసిన తమకు వచ్చే నష్టం లేదని స్పష్టం చేశారు. రేవంత్ ఫోటో పెట్టుకుని ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. నియోజకవర్గాలు పెరిగినా అధికారం తమదే అని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని ప్రభుత్వ విప్ వేముల వీరేశం వ్యాఖ్యానించారు. హరీశ్ రావుకి దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడై చూపించాలని సవాల్ విసిరారు. పార్టీకి అధ్యక్షుడయ్యే స్థాయి లేని హరీశ్ రావు.. తమ ముఖ్యమంత్రిపై మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్ రావు చిట్ చాట్ పేరుతో ఛీటింగ్ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గడీలు బద్దలు కొడతానని చెప్పిమరీ చేసి తాము చూపించామన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గుండు సున్నా చేస్తామని చెప్పి.. రేవంత్ చేసి చూపించారని అన్నారు. అసెంబ్లీ నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు బీఆర్ఎస్ను ఖేల్ ఖతం చేసిన దమ్మున్న నాయకుడు తమ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అని కొనియాడారు. ఈ దేశం మొత్తం తమ ముఖ్యమంత్రి రేవంత్ వైపు చూస్తోందని చెప్పారు. హరీశ్ రావు అక్కసు తగ్గించుకోవాలని సూచించారు.

