కలం, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) ఇటీవల ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ ప్రజలకు సూచించిన పాలసీపై కాంగ్రెస్ సీనియర్ లీడర్, ఎంపీ రేణుకా చౌదరి (Renuka Chowdhury) విమర్శలు చేశారు. మూడో బిడ్డ పుడితే రూ.30 వేలు, నాలుగో బిడ్డ పుడితే రూ.40 వేలు ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాన్ని రేణుకా చౌదరి తీవ్రంగా తప్పుబట్టారు. కేవలం పథకాల ప్రకటనలతో హెడ్ లైన్స్లో నిలవడం కాదని, సామాన్యుల వాస్తవ పరిస్థితులను ఆలోచించాలని ఆమె హితవు పలికారు. ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడం బాగానే ఉంది కానీ, ఆ పిల్లలు పుట్టిన తర్వాత వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
ఈ పథకం వెనుకున్న సమస్యలను ఎండగడుతూనే రేణుకా చౌదరి పలు ప్రశ్నల వర్షం కురిపించారు. పిల్లల్ని కనమంటున్నారు సరే, ఆ పిల్లలకు 20 ఏళ్లు వచ్చాక ఉద్యోగం వస్తుందని ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందా అని ప్రశ్నించారు. వారి చదువులకు అయ్యే ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందా అని నిలదీశారు. ఆ పిల్లల తిండి , మందులు, వారిని పెంచడానికి అయ్యే ఖర్చలును ప్రభుత్వం మోస్తుందా అని ప్రశ్నించారు. దేశంలో పెరిగిపోతున్న ధరలు, నిరుద్యోగ సమస్యల నడుమ ప్రజలకు ఇప్పుడు కావాల్సింది తాత్కాలిక పథకాలు కాదని, శాశ్వతమైన జీవనోపాధి భద్రత అని స్పష్టం చేశారు.

