కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తూ ఒకే రోజు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 700కు పైగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామారెడ్డి మండలం గిద్ద గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మొగుళ్ల బాలమణి శివరామ్ గౌడ్, ఆవుసుల పురుషోత్తం, లక్ష్మి సత్యనారాయణ వారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి (Yellareddy) నియోజకవర్గ చరిత్రలో ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు అని అన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా వందలాది కుటుంబాలు కొత్త ఇంట్లో అడుగుపెడుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.
ఒకే రోజు 700కు పైగా గృహప్రవేశాలు జరగడం నియోజకవర్గానికి గర్వకారణం అని అన్నారు. ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన జీవితం అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యమంత్రి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి అందేలా నిరంతరం కృషి కొనసాగిస్తామని తెలిపారు. కొత్త ఇంట్లో అడుగుపెట్టిన లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, జీవితకాల కలను నిజం చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గ్రామ సర్పంచులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు & నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్, మహిళ కాంగ్రెస్ నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

