కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రక్షణ సేన (TRS) పేరుతో కొత్త పార్టీని స్థాపించిన కవిత (Kavitha)కు మేడ్చల్ జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రామిడి వెంకట్ రెడ్డి (Ramidi Venkat Reddy) తన పదవికి , పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ అధినేత్రి కవిత అనుసరిస్తున్న విధానాలు, ఆమె వైఖరి ఏమాత్రం బాగా లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం కావాలంటే సమర్థవంతమైన నాయకత్వం, స్పష్టమైన ఆలోచనా విధానం ఉండాలని ఆయన పేర్కొన్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీలో అవేమీ కనిపించడం లేదని ఆయన విమర్శించారు.
పార్టీని ముందుకు తీసుకెళ్లే సరైన నాయకులు లేకపోవడం, నాయకత్వ పద్ధతులు నచ్చకపోవడంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. తన రాజీనామా లేఖను ఇప్పటికే పార్టీ అధిష్టానానికి పంపినట్లు ఆయన వెల్లడించారు. మేడ్చల్ (Medchal) జిల్లాలో కీలక నేతగా ఉన్న రామిడి వెంకట్ రెడ్డి పార్టీని వీడటం టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో పార్టీ భవిష్యత్తుపై ఈ పరిణామం ఏ ప్రభుతవం చూపుతుందోనని చర్చ నడుస్తోంది.

