కలం, వెబ్ డెస్క్ : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2026 ట్రోఫీని కైవసం చేసుకోవడంతో హైదరాబాద్లో (Hyderabad) అభిమానుల సంబరాలు హద్దులు దాటాయి. నగరంలోని ట్యాంక్ బండ్, సచివాలయం పరిసరాలు, తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద పెద్ద సంఖ్యలో ఆర్సీబీ అభిమానులు చేరుకుని భారీగా సంబరాలు జరుపుకున్నారు. ఆర్సీబీ జెండాలు, జెర్సీలతో వచ్చిన అభిమానులు జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేస్తూ నినాదాలు చేశారు. “ఈ సాలా కప్ నమ్దే” అంటూ పెద్ద ఎత్తున కేకలు వేస్తూ సందడి చేశారు. పలువురు అభిమానులు బైక్ ర్యాలీలు నిర్వహించగా, మరికొందరు రహదారులపైకి వచ్చి డ్యాన్సులు చేస్తూ హంగామా సృష్టించారు.
అయితే కొందరు అభిమానులు రోడ్డుపై వెళ్తున్న వాహనాలను అడ్డుకోవడం, వాహనదారులను ఇబ్బందులకు గురిచేయడం వల్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్యాంక్ బండ్తో పాటు సచివాలయం పరిసర ప్రాంతాలలో వాహనాల రాకపోకలు కొంతసేపు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ట్రాఫిక్ను పునరుద్ధరించేందుకు, గుంపులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.
పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా కొందరు అభిమానులు హంగామా కొనసాగించడంతో స్వల్ప లాఠీచార్జ్ చేశారు. దీంతో అక్కడి పరిస్థితి క్రమంగా అదుపులోకి వచ్చింది. ఆర్సీబీ విజయోత్సాహంలో అభిమానులు సంబరాలు జరుపుకోవడం సహజమేనని, అయితే ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరించవద్దని పోలీసులు సూచించారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం అదనపు బలగాలను కూడా మోహరించినట్లు అధికారులు తెలిపారు.

