కలం, వెబ్ డెస్క్ : దేశంలో మరోసారి కమర్షియల్ సిలిండర్ల ధర(Commercial Cylinder Price )ను చమురు సంస్థలు పెంచాయి. ఈ మేరకు దేశ వ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధరపై రూ. 42 మేర పెరగడంతో , ఇక్కడ కొత్త ధర రూ.3,113.50కి ఎగబాకింది. అటు కోల్కతాలో గరిష్టంగా రూ. 53.50 పెరిగింది. దీంతో కోల్కతాలో కొత్త ధర ఏకంగా రూ.3,255.50కి చేరింది. చిన్న తరహా వ్యాపారాలకు ఉపయోగపడే 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ ధరలను రూ.11 మేర పెంచారు. అయితే గృహ అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ (14.2 కేజీల) సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పులు చేయలేదు. పెంచిన ధరలు జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ఎల్పీజీ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మే 1న చమురు కంపెనీలు కమర్షియల్ సిలిండర్ ధరను రికార్డు స్థాయిలో రూ.993 పెంచాయి. ఆ తర్వాత నెల వ్యవధిలోనే ధర పెరగడం ఇది రెండోసారి. ఈ ధరల పెరుగుదల వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ వ్యాపారాలు, టీ స్టాళ్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. తాజా పరిణామంతో హోటళ్లలో ఆహార పదార్థాలు, టిఫిన్ల ధరలు మరింత ప్రియమయ్యే ప్రమాదం ఉంది. ఫలితంగా, ఈ భారం పరోక్షంగా మళ్లీ సామాన్య ప్రజానీకంపై పడనుంది.

