కలం, వెబ్ డెస్క్: రాయలసీమ ఎత్తిపోతల పథకం కేవలం ఒక్క జిల్లా సమస్య కాదని వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ సజ్జల (Sajjala) రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రాయలసీమకు జీవనాడి వంటిదని చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తిచేయాలని కోరుతూ ఆదివారం వైఎస్సార్ కడప జిల్లా కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో ఆయన పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు తీరుతో రాయలసీమకు తీరని నష్టం జరుగుతోందని సజ్జల మండిపడ్డారు.
చంద్రబాబు రాయలసీమకు చేసిన ద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన(Sajjala) పిలుపునిచ్చారు. చంద్రబాబు చర్యల వల్ల సీమకు తీరని నష్టం జరుగుతున్న విషయాన్ని.. కలసివచ్చే పార్టీలు, ప్రజాసంఘాలతో కలసి భారీ స్థాయిలో ఉద్యమం చేయాలని సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆర్కే రోజా, ఉషశ్రీ చరణ్, అంజాద్ బాషా, సాకే శైలజానాథ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

