కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు చేయక రైతులు కన్నీరు పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్చందర్ రావు (Ramchander Rao) ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజులుగా మండుటెండల్లో కనీసం తిండి, నీళ్ల సౌకర్యం కూడా లేక ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలకు తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోలు (Paddy Procurement)కు 100 శాతం నిధులు, మద్దతు ధర, టార్పాలిన్లు, కాంటాలకు అయ్యే ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నా.. రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వానికి రైతులంటే ఎందుకింత నిర్లక్ష్యం? అని ప్రశ్నించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే బీజేపీ, కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడవద్దని.. బీజేపీ (BJP) తమకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. బతికి పోరాడుదామని.. తమ హక్కులు సాధించుకుందామని ఆయన పిలుపునిచ్చారు.

