కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1 (IPL Qualifier 1) లో ఆర్సీబీకి రెండు పేర్లు ఇప్పుడు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. కెప్టెన్ రజత్ పటీదార్, ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్. గుజరాత్ టైటాన్స్తో జరిగే కీలక మ్యాచ్లో ఈ ఇద్దరూ జట్టుకు ప్రధాన బలంగా మారే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్కు చెందిన ఈ ఇద్దరు ఆటగాళ్లు ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్ల్లో అద్భుత రికార్డులు కలిగి ఉన్నారు. ముఖ్యంగా ఒత్తిడి మ్యాచ్ల్లో వీరి ఆట ఆర్సీబీ అభిమానుల్లో నమ్మకం పెంచుతోంది.
రజత్ పటీదార్ ఇప్పటివరకు ఐదు ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్ల్లో 245 పరుగులు చేశాడు. అతని సగటు 81కు పైగా ఉండగా, స్ట్రైక్ రేట్ 172 దాటింది. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. 2022లో లక్నో సూపర్ జెయింట్స్పై చేసిన అజేయ 112 పరుగుల ఇన్నింగ్స్ ఇప్పటికీ ఆర్సీబీకి గుర్తుండిపోయే నాక్స్లో ఒకటిగా నిలిచింది. టీ20 నాకౌట్ మ్యాచ్ల్లో రజత్ రికార్డు ఇంకా బలంగా ఉంది. ఆర్సీబీ, మధ్యప్రదేశ్ తరఫున కలిపి ఎనిమిది మ్యాచ్ల్లో 420 పరుగులు చేశాడు.
అతని సగటు 105 కాగా, స్ట్రైక్రేట్ 183కు పైగా ఉంది. ఒక సెంచరీతో పాటు మూడు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ సీజన్లో కెప్టెన్సీ ఒత్తిడి మధ్య కూడా పటీదార్ అద్భుత ఫామ్లో ఉన్నాడు. 13 ఇన్నింగ్స్ల్లో 393 పరుగులు చేశాడు. నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అలాగే 32 సిక్సర్లు బాదాడు. మరోవైపు వెంకటేశ్ అయ్యర్ కూడా నాకౌట్ మ్యాచ్ల్లో మంచి రికార్డు కలిగి ఉన్నాడు. గతంలో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన అతడు, ఇప్పుడు తొలిసారి ఆర్సీబీ కోసం ప్లేఆఫ్ మ్యాచ్ ఆడనున్నాడు.
ఐదు ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్ల్లో వెంకటేశ్ 234 పరుగులు చేశాడు. అతని సగటు 78 కాగా, స్ట్రైక్రేట్ 149కు పైగా ఉంది. వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేయడం అతని ప్రత్యేకతగా నిలిచింది. ఈ సీజన్లో కూడా వెంకటేశ్ జట్టుకు కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. అవసరమైనప్పుడు వికెట్లు కాపాడటం, మధ్య ఓవర్లలో వేగంగా పరుగులు చేయడం, ఓపెనర్గా రాణించడం వంటి పాత్రలు పోషించాడు. నాలుగు ఇన్నింగ్స్ల్లో 158 పరుగులు చేసి మంచి ప్రభావం చూపించాడు. ఇందులో అజేయ 73 పరుగుల ఇన్నింగ్స్ కూడా ఉంది.

