కలం, భువనగిరి: యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి కొండపైన ప్రస్తుతం ఉన్న వర్తక సంఘాన్ని తక్షణమే రద్దు చేసి, బహిరంగ టెండర్లు నిర్వహించాలని యాదాద్రి పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) వెంకారెడ్డిని కమిటీ ప్రతినిధులు కలిసి ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. కొండపైన వర్తక సంఘం ఏకఛత్రాధిపత్యానికి స్వస్తి పలికి, పారదర్శకంగా టెండర్లు వేయడం ద్వారా యాదగిరిగుట్ట దేవస్థానానికి అదనంగా రూ. 20 కోట్ల నుండి రూ. 30 కోట్ల వరకు భారీ ఆదాయం సమకూరుతుందని వారు స్పష్టం చేశారు.
“వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్లు పిలవడం ద్వారా వచ్చే అదనపు ఆదాయంతో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు మరిన్ని మెరుగైన వసతులు, సదుపాయాలు కల్పించవచ్చు. అంతేకాకుండా, బహిరంగ టెండర్ల వల్ల ఎంతోమంది స్థానిక నిరుద్యోగులకు కొత్తగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.” అని యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులు తెలిపారు. కొండపై వ్యాపారాల నిర్వహణలో పారదర్శకత పెరగాలంటే టెండర్ల ప్రక్రియే ఏకైక మార్గమని కమిటీ పేర్కొంది. ఉన్నతాధికారులు స్పందించి, వర్తక సంఘాన్ని తక్షణమే రద్దు చేసి, కొత్త టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి పరిరక్షణ కమిటీ ముఖ్య నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

