కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ప్రస్తుతం విచిత్రమైన వాతారణ పరిస్థితులున్నాయి. మార్చి నెలలో ఎండలు మండిపోవాల్సి ఉండగా.. అనుహ్యంగా అకాల వర్షాలు ప్రజలను పలకరిస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇప్పటికే పలు జిల్లాల్లో వడగండ్ల వాన(Rain) కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ మరోసారి బిగ్ అలర్ట్ జారీ చేసింది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో రాగల 2 రోజలు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఈ నేపథ్యంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3°C తక్కువగా నమోదవుతాయని పేర్కొంది. రేపు (మార్చి 21) మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

