కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిసిపి కార్యాలయానికి లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేరుకున్నారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో గాయపడిన బాధితుడు సాహిల్ లోచావ్తో కలిసి ఆయన డిసిపిని కలిశారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, అలాగే కేసు విచారణాధికారి (I/O) నంబర్ను కేటాయించాలని రాహుల్ గాంధీ పట్టుబట్టారు.
కాంగ్రెస్ నేతల సమాచారం ప్రకారం, బాధితుడు సాహిల్ లోచావ్ ఆగస్టు 14వ తేదీన తన న్యాయవాదులతో కలిసి ఢిల్లీ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. అయినప్పటికీ పోలీసులు ఐ/ఓ నంబర్ లేదా రశీదు ఇవ్వడానికి నిరాకరించారు. ఆ తర్వాత ఆగస్టు 17న ఇమెయిల్, ఫోన్ ద్వారా మళ్లీ ప్రయత్నించినప్పటికీ, పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లభించలేదు.
దీంతో ఈ వ్యవహారంలో నేరుగా జోక్యం చేసుకున్న రాహుల్ గాంధీ, బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్వయంగా డిసిపి కార్యాలయానికి వచ్చారు. ఇది కాగ్నిజబుల్ నేరం కాబట్టి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే ఢిల్లీ పోలీసులు మాత్రం ఇప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, విచారణాధికారి నంబర్ను ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

