కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi).. మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి, దాని స్థానంలో ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ గ్రామ్ స్వరాజ్’ (VB-G RAM G) అనే కొత్త బిల్లును ప్రవేశపెట్టడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నిర్ణయం పూర్తిగా ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కరి చేతుల్లోనే జరిగిందని, సంబంధిత మంత్రులను కూడా సంప్రదించలేదని ఆరోపించారు. ఇది కేంద్రంలో ‘వన్ మ్యాన్ షో’ నడుస్తోందని సూచిస్తుందని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం అనంతరం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాట్లాడుతూ.. ‘MGNREGA’ ఒక సాధారణ పథకం కాదు, అది ఒక సంస్కరణ అన్నారు. ఇది కోట్లాది మంది గ్రామీణ ప్రజల జీవితాలను మార్చిందని, ఇప్పుడు ఈ డైరెక్ట్ హక్కుల భావనపై దాడి జరుగుతోందని ఫైర్ అయ్యారు. ఈ నిర్ణయం ప్రధాని కార్యాలయం (PMO) నుంచి నేరుగా వచ్చిందని, సంబంధిత మంత్రులను సంప్రదించకుండానే తీసుకున్నారని తెలిపారు. పాలన పూర్తిగా వన్ మ్యాన్ షోగా మారిందని, నరేంద్ర మోడీకి ఏమి కావాలంటే అది జరుగుతుందని ఆయన విమర్శించారు.
రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరిన్ని వివరాలు వెల్లడిస్తూ.. ఈ మార్పులు రాష్ట్రాలపై దాడిగా పేర్కొన్నారు. రాష్ట్రాలకు చెందిన డబ్బును, నిర్ణయాధికారాన్ని కేంద్రం తీసుకుంటోందన్నారు. ఈ నిర్ణయం నోట్బంది లాంటిదని.. పేదలు, దళితులు, ఆదివాసీలు, OBCలు, మైనార్టీలకు భారీ నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు. ఇది పేదల డబ్బును తీసుకుని అదానీ లాంటి వ్యాపారవేత్తలకు ఇచ్చేందుకే అని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ ఈ మార్పులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చించి, జనవరి 5 నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఈ మార్పులను వ్యతిరేకించారు. 16 దేశాల్లో MGNREGAను అభినందించారని గుర్తు చేశారు.
Read Also: బీజేపీపై దిగ్విజయ్ పొగడ్తలు.. కాంగ్రెస్లో అలజడులు
Follow Us On : WhatsApp


