కలం, వెబ్ డెస్క్ : అమెరికా దాడుల్లో ముగ్గురు భారతీయ నావికుల మరణంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటనపై అమెరికా కనీసం విచారం వ్యక్తం చేయలేదని, క్షమాపణలు కూడా చెప్పలేదని ఆయన మండిపడ్డారు. పైగా భారత దేశానికి అమెరికా ఆర్డర్లు వేస్తోందని, తమ సైనిక ఆదేశాలను తక్షణమే పాటించాలంటూ హెచ్చరికలు జారీ చేయడం దారుణమన్నారు. ఏ ఒక్క ఉల్లంఘనను కూడా సహించేది లేదంటూ అమెరికా మాట్లాడుతున్న తీరును ఆయన తప్పుబట్టారు.
స్వతంత్రంగా ఉండే ఏ దేశమూ ఇలాంటి భాషను, హెచ్చరికలను సహించబోదని రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పష్టం చేశారు. అయితే మన దేశ ప్రధాని మాత్రం ఈ వ్యవహారంలో పూర్తిగా మౌనం వహిస్తున్నారని ఆయన విమర్శించారు. ఒక లొంగిపోయిన ప్రధానిలా వ్యవహరిస్తూ, అమెరికా చెప్పినట్లు వింటూ దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. దేశాన్ని అవమానిస్తున్న శక్తుల నియంత్రణలో ప్రస్తుత ప్రధాని ఉన్నారని, అందుకే ఆయన దేశ గౌరవాన్ని కాపాడలేకపోతున్నారని రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

