కలం వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal)లో కాంగ్రెస్ కార్యకర్త దేబ్దీప్ ఛటర్జీ హత్యపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఎన్నికల తర్వాత కూడా టీఎంసీ (TMC) గూండాలు దారుణంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. బెంగాల్లో టీఎంసీ అరాచక పాలన చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్త దేబ్దీప్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిజయేశారు. బెంగాల్లో ప్రజాస్వామ్య పాలన జరగడం లేదని, ప్రజలను భయపెట్టే పాలన జరుగుతోందని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను భయపెట్టడం, చంపడమే టీఎంసీ రాజకీయమని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ హింసను ప్రోత్సహించలేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తమ కార్యకర్తల ప్రాణాలు పోయినా కాంగ్రెస్ రాజ్యాంగబద్ధమైన అహింసా మార్గాన్నే అనుసరిస్తుందని చెప్పారు. ఈ హత్యకు కారణమైన నిందితులందరినీ వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, దేబ్దీప్ కుటుంబానికి పూర్తి భద్రతతో పాటు పరిహారం అందించాలని రాహుల్ డిమాండ్ చేశారు. భారత దేశంలో అహింసా సంప్రదాయానికి మచ్చ తెచ్చే ఇటువంటి రాజకీయాలకు తలొగ్గేది లేదని, ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

