కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలోని (Delhi) ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం విమానానికి భారీ ప్రమాదం తప్పింది. స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్కు బయలుదేరాల్సిన స్విస్ ఎయిర్ విమానం (Plane) టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా ఇంజిన్లో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన పైలట్లు అప్రమత్తమై వెంటనే టేకాఫ్ను నిలిపివేశారు. ఆ సమయంలో విమానంలో నలుగురు చిన్నారులతో సహా మొత్తం 232 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలు వ్యాపించకముందే విమానాన్ని రన్వేపై నిలిపివేసి ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించారు.
అయితే ఎమర్జెన్సీ ద్వారా కిందకు దిగే క్రమంలో ఆరుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో విమానాశ్రయంలోని 28వ నంబర్ రన్వేను తాత్కాలికంగా మూసివేశారు. సాంకేతిక నిపుణులు వచ్చే వరకు విమానం రన్వేపైనే ఉంది. ప్రయాణికులకు హోటల్ వసతితో పాటు ప్రత్యామ్నాయ విమాన ఏర్పాట్లు చేస్తామని ఎయిర్లైన్స్ సంస్థ ప్రకటించింది. ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని స్విస్ ఎయిర్ వెల్లడించింది.

