కలం, వెబ్ డెస్క్ : ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో చేసిన సూచనలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఫైర్ అయ్యారు. బంగారం కొనుగోలును వాయిదా వేసుకోవాలని, ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని, విదేశీ ప్రయాణాలకు దూరంగా ఉండాలని మోదీ విజ్ఞప్తులు వైఫల్యానికి నిదర్శనమని రాహుల్ ఎక్స్ వేదికగా విమర్శించారు. బీజేపీ దశాబ్ద కాల పాలనకు సంబంధించిన లోపాలను మోదీ సూచనలు బట్టబయలు చేశాయని ఆయన (Rahul Gandhi) ఆరోపించారు.
12 సంవత్సరాల్లో భారత్ ను తీవ్ర దుస్థితికి తీసుకువచ్చారని ప్రధానిపై ధ్వజమెత్తారు. ప్రజలు ఏం కొనాలి, ఏం కొనకూడదు, ఎక్కడికి వెళ్లాలి – ఎక్కడికి వెళ్లకూడదు అనే విషయాలు మోదీ చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను కాపాడుకోవడానికి ప్రజలను బలిపశువులను చేస్తున్నారని ఆరోపించారు. రాజీ పడిన ప్రధానమంత్రికి ఇక దేశాన్ని నడిపే శక్తి లేదని రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

