కలం, మెదక్ బ్యూరో: తాను ఎవరితోనూ లాలూచీ పడటం లేదని, తాను బీఆర్ఎస్ పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేశానంటూ టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత (Kavitha) నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) మండిపడ్డారు. ఇంకోసారి తన గురించి మాట్లాడితే జూబ్లిహిల్స్కి వచ్చి కవిత ఇంటి ముందే మైక్ పెట్టి మాట్లాడుతానని హెచ్చరించారు. తెలంగాణ వస్తే సింగూరు ప్రాజెక్టుపై కుర్చీ వేసుకుని మరమ్మతులు చేయిస్తానన్న కేసీఆర్ ఎందుకు ఆ పనులు చేయలేదని రఘునందన్ నిలదీశారు. సింగూరులో చేపలు తినలేకపోయిండు గానీ, ఆంధ్రా పోయి రోజా ఇంట్లో రొయ్యలు మాత్రం మింగిండని విమర్శించారు.
ఆదివారం సంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ జెండా పండుగలో భాగంగా పర్యటించిన కవిత అన్ని పార్టీల వారు మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నారంటూ పలు విమర్శలు చేశారు. దీంతో ఆమె వ్యాఖ్యలకు కౌంటర్గా సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో మెదక్ ఎంపీ రఘనందన్ రావు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కవిత పార్టీకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆమె ఎవరితో కలిసి పనిచేస్తున్నారో తెలుసని రఘునందన్ అన్నారు. జాగృతి పెట్టినప్పుడు కవితకు, ఇప్పటి కవితకు చాలా తేడా ఉందని వ్యాఖ్యానించారు.
తెల్లాపూర్ను తెలంగాణపూర్గా మార్పిస్తానని చెప్పారని, మీ నాయన సీఎంగా ఉన్నప్పటికీ ఒక్క పని కూడా చేయించలేక పోయావని విమర్శించారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం ఇవ్వకపోతే తెల్లాపూర్ శాసనానికి కట్టేసి కొట్టమని చెపుతున్నారని ఎద్దేవా చేశారు. కవిత నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడుతుందని విమర్శించారు. తానేదో జహీరాబాద్ ఎంపీ అన్నట్లుగా కవిత అవివేకంగా మాట్లాడుతుందని, తాను మెదక్ ఎంపీ అన్న విషయం కవితకు తెలియదా? అని ప్రశ్నించారు. తాను జహీరాబాద్కు బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తానని హామీ ఇచ్చినట్లు కవిత చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రఘునందన్ అన్నారు.

