కలం, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు (Raghu Rama Krishna Raju)కు మాజీ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ (PV Sunil Kumar) బహిరంగ సవాల్ విసిరారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రఘురామ మాట్లాడుతూ.. గతంలో కొందరు అధికారులు పోటీ చేస్తే వందల ఓట్లే వచ్చాయని, సునీల్ కుమార్ పోటీ చేస్తే 500 ఓట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. దీనిపై ఘాటుగా స్పందించిన సునీల్ కుమార్ రఘురామ తన పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని డిమాండ్ చేశారు. “మీకు నచ్చిన పార్టీ నుంచి మీరు టికెట్ తెచ్చుకోండి, నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను. మీకంటే నాకు వెయ్యి ఓట్లు తక్కువ వచ్చినా నేను మళ్లీ రాజకీయాల గురించి మాట్లాడను. మరి నేను మీకంటే ఎక్కువ ఓట్లు సాధిస్తే, మీరు రాజకీయాల నుండి తప్పుకుంటారా?” అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు.
గతంలో తన పేరు చెప్పుకుని లేదా తన ఫోటో పెట్టుకుని శ్రీకాకుళం, ఆత్మకూరు వంటి ప్రాంతాల్లో కొందరు అభ్యర్థులు ఘన విజయం సాధించారని సునీల్ కుమార్ గుర్తు చేశారు. రఘురామకు తనపై అంత నమ్మకం ఉంటే ఈ సవాల్ను స్వీకరించి రాజీనామా చేయాలని ఆయన స్పష్టం చేశారు. తనను తక్కువ అంచనా వేయడం మానుకోవాలని, ఎన్నికల బరిలోనే ఎవరు ఎంతో తేల్చుకుందామని సునీల్ కుమార్ పేర్కొన్నారు.

