కలం, ఖమ్మం బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఖమ్మం జిల్లా సహా నగర ముఖచిత్రం మారిందని, తమ పాలనలోనే ఊహించని అభివృద్ధి సాధ్యమైందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ (Puvvada Ajay Kumar) అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల స్ఫూర్తితో ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలుగా పాలన సాగాలని ఆకాంక్షించారు.
కేసీఆర్ నాయకత్వంలో నగర సుందరీకరణ, నాణ్యమైన రోడ్లు, డ్రైనేజీలు, వంతెనల నిర్మాణంతోపాటు సీతారామ, భక్త రామదాసు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించామని పువ్వాడ గుర్తుచేశారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన అభివృద్ధి పునాదులపై ప్రస్తుత ప్రభుత్వం పనులను కొనసాగించి, కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని సూచించారు. ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలని పువ్వాడ ఆశాభావం వ్యక్తం చేశారు.

