కలం, ఖమ్మం బ్యూరో : తెలంగాణ గౌరవాన్ని, సామాజిక–రాజకీయ అస్తిత్వాన్ని, స్వాభిమానాన్ని పరిరక్షించుకోవడమే ప్రొఫెసర్ జయశంకర్కు మనం అందించే నిజమైన ఘన నివాళి అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay ) పునరుద్ఘాటించారు. బుధవారం తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ మేధావి, పోరాట స్ఫూర్తి ప్రదాత ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ మాజీ మంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ప్రొఫెసర్ జయశంకర్ అందించిన సిద్ధాంత బలం, మార్గదర్శకత్వం, త్యాగం చిరస్మరణీయమని పేర్కొన్నారు. జయశంకర్ చూపిన బాటలోనే కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారని, అచంచల సంకల్పం, మొక్కవోని దీక్ష, సాహసోపేత పోరాటంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి విజయతీరాలకు చేర్చారని తెలిపారు.
ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ నాయకత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను దేశానికే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిందని పువ్వాడ అజయ్ కుమార్ గుర్తుచేశారు. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, తాగునీరు, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అన్ని రంగాల్లో విశిష్టమైన పురోగతి సాధించామని అన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని సకల జనుల అభ్యున్నతికి కృషి చేయడం ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ కలల తెలంగాణను సాకారం చేసే దిశగా కేసీఆర్ ప్రభుత్వం విజయవంతంగా పనిచేసిందని ఆయన పేర్కొన్నారు.

