కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శ్రామికుల కష్టాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay) ఎద్దేవా చేశారు. శుక్రవారం ఖమ్మం రైతు బజార్ ఆటో అడ్డా వద్ద మే డే సందర్భంగా జెండా ఆవిష్కరించి, కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లక్షలాది కార్మికుల ఉద్యమాల ఫలితమే మేడే అని గుర్తుచేశారు.
అనేక రంగాల్లో కార్మికులు తమ చెమటను చిందించి పని చేస్తున్నారని, దేశ, రాష్ట్ర, మానవ ప్రగతికి శ్రామికుల సేవలు ఎంతో దోహదం చేస్తున్నాయన్నారు. కార్మికులు పనిచేయడం ఆపేస్తే మొత్తం ప్రపంచం స్తంభిస్తుందన్నారు. కార్మికుల త్యాగాలు, వారి కష్టాన్ని యావత్ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ (KCR) పదేళ్ల పాలనలో కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, కార్మికులను వెల్ఫేర్ బోర్డు ద్వారా అనేక రకాలుగా ఆదుకున్నామని ఆయన (Puvvada Ajay) గుర్తు చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కార్మికులకు అండగా నిలబడటమే కాకుండా, వారి పక్షాన ఉండి పోరాటాలు చేసేందుకు బీఆర్టీయూ సిద్ధంగా ఉండాలన్నారు. అలాగే బీఆర్టీయూ పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. కార్మికులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, నగర మాజీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్ జ్యోతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Also: 2026 వరల్డ్ కప్లో ఇరాన్ ఆడుతుంది: ఫిఫా క్లారిటీ
Follow Us On: X(Twitter)

