కలం, స్పోర్ట్స్: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల మధ్య ఫిఫా (FIFA) కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా వేదికగా జరిగే 2026 ఫుట్బాల్ వరల్డ్ కప్లో ఇరాన్ జట్టు ఖచ్చితంగా పాల్గొంటుందని ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో స్పష్టం చేశారు. వాంకోవర్లో జరిగిన 76వ ఫిఫా కాంగ్రెస్ వేదికగా ఆయన ఈ ప్రకటన చేశారు. అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా నిర్వహించే ఈ మెగా టోర్నీలో మొత్తం 48 జట్లు తలపడనున్నాయి. ఇజ్రాయెల్, అమెరికాతో నెలకొన్న రాజకీయ గొడవల వల్ల ఇరాన్ (Iran) ఈ టోర్నీకి దూరంగా ఉంటుందనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. దీనిపై స్పందించిన ఇన్ఫాంటినో.. ఇరాన్ అమెరికా గడ్డపై ఆడుతుందని, అందులో ఎలాంటి సందేహం లేదని తేల్చి చెప్పారు. ప్రపంచాన్ని ఏకం చేయడమే ఫుట్బాల్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
సమాజంలో ఇప్పటికే ఎన్నో విభేదాలు ఉన్నాయని, ప్రజలను కలిపి ఉంచాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తుచేశారు. సానుకూల దృక్పథంతో ఉంటేనే ఏదైనా సాధించగలమని ఆయన పిలుపునిచ్చారు. అందరూ కలిసి ఉంటేనే ఆట మరింత అందంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ఈ సదస్సుకు ఇరాన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అధికారులు హాజరుకాలేదు. కెనడా ఇమ్మిగ్రేషన్ అధికారుల ప్రవర్తన సరిగ్గా లేకపోవడం వల్లే తమ బృందం వెనక్కి తిరిగి వచ్చిందని ఇరాన్ వార్తా సంస్థ తెలిపింది. మరోవైపు కెనడా విదేశాంగ మంత్రి కూడా ఇరాన్ అధికారుల అనుమతులను రద్దు చేసినట్లు వెల్లడించారు. ఈ పరిణామాలన్నింటినీ పక్కన పెట్టి, ఫిఫా (FIFA) మాత్రం ఇరాన్ను టోర్నీలో భాగం చేయడానికే మొగ్గు చూపుతోంది. ప్రపంచ కప్ ద్వారా శాంతిని నెలకొల్పాలని ఫిఫా లక్ష్యంగా పెట్టుకుంది.
Read Also: జాగృతి టు రక్షణ సేన… కవిత ట్విస్టుల మీద ట్విస్టులు
Follow Us On: Instagram

